సౌదీ అరేబియాకు 8 వేల మంది సైనికులను పంపించిన పాకిస్థాన్

  • 16 యుద్ధ విమానాలతో కూడిన స్క్వాడ్రాన్, వాయువ్యవస్థ సౌదీకి తరలింపు
  • సౌదీ అరేబియా సరిహద్దుల్లో మోహరించనున్న పాకిస్థాన్ బలగాలు
  • ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందం
అమెరికా, ఇరాన్ యుద్ధం వేళ, సౌదీ అరేబియాకు పాకిస్థాన్ 8 వేల మంది సైనికులను పంపించింది. 16 యుద్ధ విమానాలతో కూడిన స్క్వాడ్రన్, వాయు రక్షణ వ్యవస్థను ఏప్రిల్‌లోనే సౌదీకి తరలించినట్లు పాకిస్థాన్ ఉన్నతాధికారులు తెలిపారు. ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌లో అధిక భాగం చైనాతో కలిసి తయారు చేసిన జేఎఫ్ 17 యుద్ధ విమానాలు ఉన్నాయి. పాకిస్థాన్ బలగాలను సౌదీ అరేబియా సరిహద్దుల్లో మోహరించనున్నట్లు తెలుస్తోంది.

ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో సౌదీ అరేబియాపై ఇరాన్ మళ్ళీ దాడులకు దిగితే వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా తమ సైన్యాన్ని పంపుతున్నట్లు పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు. అమెరికా-ఇరాన్ యుద్ధంలో పాకిస్థాన్ ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఓ వైపు మధ్యవర్తిత్వం వహిస్తూ, మరోవైపు సౌదీకి మద్దతుగా సైన్యాన్ని పంపించడం గమనార్హం.

రెండు దేశాల మధ్య గత సంవత్సరం రక్షణ ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్, సౌదీ అరేబియా దేశాలపై దేనిపై అయినా దాడి జరిపితే అది ఇద్దరిపై జరిగిన దాడిగా భావించాలని, అప్పుడు ఇరువురు కలిసి శత్రువులతో పోరాడాలన్నది ఆ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం.

Pakistan
Saudi Arabia
Pakistan military
Saudi Arabia military
Iran
US Iran conflict
JF 17 fighter jets

More Telugu News